ఒక్కంగుళం భూభాగాన్ని కూడా చైనాకు వదిలేది లేదు: భారత ఆర్మీ నూతన చీఫ్ మనోజ్ పాండే

  • భారత కొత్త సైన్యాధిపతిగా మనోజ్ పాండే
  • సైన్యం వైఖరిని స్పష్టం చేసిన లెఫ్టినెంట్ జనరల్
  • సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి
  • ఎలాంటి దురాక్రమణను అంగీకరించబోమని స్పష్టీకరణ
ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ నూతన చీఫ్ గా బాధ్యతలు అందుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సైన్యం వైఖరిని స్పష్టం చేశారు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు. భారత్-చైనా సరిహద్దులో ఇప్పుడున్న స్థితిని మార్చడానికి ఏమాత్రం అంగీకరించబోమని, తమ వైఖరి ఇదేనని ఉద్ఘాటించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. 

తమ సన్నద్ధత గురించి చెబుతూ, చైనాతో సరిహద్దుల్లో అదనపు వ్యవస్థలు, బలగాలను మోహరించామని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించామని వివరించారు. 

ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నది సంప్రదాయ యుద్ధమేనని అభిప్రాయపడ్డారు. భారత్ విషయానికొస్తే దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Manoj Pande
Army
Lt Gen
Indo-China Border

More Telugu News